మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు
అమరావతి – పేద రైతుల జీవనోపాధి మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. పాల దిగుబడి పెంచే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాడి రైతులకు తోడ్పాటు అందించేందుకు “ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు” పథకం అమలు చేశామని, కానీ వైసీపీ సర్కార్ వచ్చాక మంగళం పాడిందన్నారు.
పాల సేకరణలో నిబంధనలు విధించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.
ఉపాధి హామీ పథకంలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాల పెంపకం కార్యక్రమాన్ని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తోందని, పశుగ్రాసం పెంపకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతులు (అనగా 5 ఎకరాలలోపు గల వారికి) ఉన్న పొలములో కనీసం 25 సెంట్లు నుండి రెండున్నర ఎకరాల వరకు పశుగ్రాసంను పెంచేందుకు దుక్కి దున్నడం, విత్తనము, గడ్డి కణుపులు నాటడం, నీటి సరఫరా , ఎరువుల కోసం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు మంత్రి.
వేతన సామాగ్రి ఖర్చు 2 ఏళ్ల కాల వ్యవధిలో ఒక ఎకరానికి రూ.99 వేలు లబ్ధి చేకూరుతుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. అర్హులైన ప్రతి రైతుకు అమలు చేయాలని ఉపాధి హామీ, పశు సంవర్ధక శాఖ అధికారులను అచ్చెన్నాయుడు ఆదేశించారు.