మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన
అమరావతి – కోళ్ల మృత్యువాత ఘటనలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారంలో 50 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయన్న ఘటనపై స్పందించారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు.
కోళ్లకు వైరస్ సోకకుండా అధికార బృందం ముందు జాగ్రత్తలను చేపట్టిందని వెల్లడించారు. మంత్రి దుర్గేష్. గ్రామంలో, ఫౌల్ట్రీ సంబంధిత ప్రదేశాల్లో అధికారులు శానిటేషన్ ప్రక్రియ చేపట్టారని తెలిపారు.
ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కొన్నాళ్ల పాటు గ్రామస్థులు చికెన్, గుడ్లు తినవద్దని మంత్రి దుర్గేష్ సూచించారు. కానూరు అగ్రహారానికి 10 కి.మీ ల పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ అంశంపై కలెక్టర్ పి. ప్రశాంతితో పాటు స్థానిక ఎంపీడీవో సి.హెచ్ వెంకట రమణ, ఎమ్మార్వో అచ్యుత కుమారిలతో చర్చించానని ప్రజలెవరూ భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదన్నారు.
చనిపోయిన 10 వేల కోళ్లను గొయ్యి తీసి పూడ్చి పెట్టే కార్యక్రమాన్ని అధికారులు పూర్తి చేశారని పేర్కొన్నారు. మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా అవసరమైన ముందు జాగ్రత్తలను అధికారులు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాని భరోసానిచ్చారు.
ప్రత్యేకించి ఫౌల్ట్రీ నిర్వాహకులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వైరస్ సోకిన కోళ్లను తగిన జాగ్రత్తలతో పూడ్చిపెట్టాలని, వాటి తరలింపులో అత్యంత సురక్షిత మార్గాలను అనుసరించాలని ఆదేశించారు. చనిపోయిన కోళ్లను ప్రజలకు విక్రయించవద్దని హెచ్చరించారు.