మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు
అమరావతి – అధిక దిగుబడులు ఇచ్చే సరికొత్త వంగడాల సృష్టికి ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం కేంద్ర బిందువు కావాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. గుంటూరులోని ఎన్జీ రంగా యూనివర్సిటీ 62 వ ఫౌండేషన్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రైతులకు మేలు జరిగే విధంగా, అధిక దిగుబడులు ఇచ్చే సరికొత్త వంగడాలను సృష్టించాలని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలకు సూచించారు. రైతులకు అధిక దిగుబడి వచ్చేలా, పెట్టుబడి తగ్గేలా విత్తనాలను తయారు చేయాలని స్పష్టం చేశారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ యూనివర్సిటీ నుండి విద్నను అభ్యసించటం, వారంతా గొప్ప స్థానాల్లో ఉండటం గర్వకారణమని అన్నారు.
కాలానుగుణంగా పరిస్థితులో చాలా మార్పులు వచ్చాయని, అందుకు తగ్గట్టుగానే వ్యవసాయం చేసే విధానంలో కూడా మార్పులు చేయాలని స్పష్టం చేశారు. రైతులు పురుగు మందుల వాడకం తగ్గించాలని, సేంద్రియ వ్యవసాయం పై రైతులకు అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒకే విధమైన పంటను కాకుండా ఇతర పంటలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. భూసార పరీక్షలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు కింజారపు అచ్చెన్నాయుడు.