మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి – ఏపీలో త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. తుపానుల నుండి పంటలను రక్షించేందుకు పంట కాలం ముందుకు జరపాలని సీఎం సూచించారని తెలిపారు. భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జలవనరుల సమర్థ వినియోగం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. నీటి పారుదల శాఖపై సమీక్ష చేపట్టారు.
ఒక్క ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా 3,4 ఏళ్లు కరువొచ్చినా వాటర్ మానేజ్మెంట్ జరగాలని సీఎం చంద్రబాబు సూచించారని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. వెలిగొండ స్టేజ్ -1 పనులు 2026 జూన్ నాటికి పూర్తి చేయడానికి, కేంద్ర ఆర్ధిక సాయం కోసం శాస్కీ లో పెట్టాలన్నారు. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ పనులపై బాబు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. సివిల్ వర్క్స్ 81.70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు నిమ్మల రామానాయుడు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కేవలం 3 శాతం మాత్రమే పూర్తి చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6 శాతం పనులు పూర్తి చేశామన్నారు.
పోలవరం డి వాల్ పనులు 3 కట్టర్లతో శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వరదల్లో కూడా పోలవరం పనులు చేసేలా, ఎగువ కాఫర్ డ్యామ్ ను బలోపేతం చేసేలా పనులు జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది చివరినాటికి పోలవరం డి వాల్ పనులు పూర్తి చేసేలా పనులు చేస్తున్నామన్నారు. బుడమేరు ప్రవాహానికి అడ్డంకులు లేకుండా పూడికతీత, విస్తరణ పనులు చేపట్టాలని చంద్రబాబు సూచించారని తెలిపారు.
పోలవరం బనకచర్ల వల్ల తెలంగాణకు కూడా ప్రయోజనం ఉంటుందన్నారు.