మంత్రిని కలిసిన ఆర్టీసీ సంఘం నేతలు
హైదరాబాద్ – ఆర్టీసీ సంస్థలో చోటు చేసుకున్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రిని కలిశారు ఆర్టీసీ జేఏసి చైర్మన్ టిఎంయూ జనరల్ సెక్రెటరీ అశ్వద్ధామ రెడ్డి, ఎన్ఎంయూ జనరల్ సెక్రెటరీ నరేందర్ ,కార్మిక సంఘ్ జనరల్ సెక్రెటరీ ఎర్ర స్వామి కుమార్ , STMU జనరల్ సెక్రెటరీ పున్న హరి కృష్ణ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా గత కొంత కాలంగా ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు మంత్రికి.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ సమస్యల పై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా ఈరోజు , రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చని అన్నారు. మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి నేను కానీ మా ముఖ్యమంత్రి గారి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం , ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, సమస్యలు ఒక్కటొక్కటిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దయచేసి సమ్మె విరమించాలని కోరారు. ఆర్టీసీ కి 16 నెలలు గా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామని, ఏనాడైనా ఇబ్బంది పెట్టామా అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారని, సహకరించాలని కోరారు. గత బీఆర్ఎస్ సర్కార్ సంస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
TGSRTC ఉద్యోగులకు 2013 నుండి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ.400 కోట్లు చెల్లించిందన్నారు. 2017 పే స్కేల్ 21 శాతం ఇచ్చామని, దీని కారణంగా ఏడాదికి రూ. 412 కోట్ల భారం పడుతుందన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న 1039 కోట్లు చెల్లించామన్నారు. నెలవారీ PF కంట్రిబ్యూషన్ జనవరి-2024 నుండి క్రమం తప్పకుండా చెల్లిస్తూ వచ్చామని తెలిపారు. 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టామన్నారు. ప్రభుత్వం 3038 మంది జాబ్స్ భర్తీ చేసేందుకు పర్మిషన్ ఇచ్చిందని చెప్పారు.