మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు
అమరావతి – ఎందరో చేసిన త్యాగాల ఫలితమే నేటి విశాఖ స్టీల్ ప్లాంట్ అని పేర్కొన్నారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. ఆర్థిక ప్యాకేజీ కింద కేంద్రం రూ. 11 వేల 440 కోట్లు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పీఎం మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కావాలని కర్మాగారాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజీ వల్ల పునర్ వైభవం వస్తుందన్నారు.
అంతే కాకుండా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి అందించిన సహకారం మరిచి పోలేమన్నారు. శనివారం మండలిపల్లి రాం ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన ఘనత అని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. అమృతరావు, తెన్నేటి విశ్వనాధం చేసిన కృషి, వేలాది మంది తెలుగువారి పోరాటం ఫలితంగా 32 మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిందన్నారు. ఆనాడు 64 గ్రామాల ప్రజలు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సహకారం అందించారని గుర్తు చేశారు.