స్పష్టం చేసిన మంత్రి ఎస్. సవిత కామెంట్
అమరావతి : బీసీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు మంత్రి ఎస్. సవిత. టీడీపీ బహుజనుల అభివృద్దిపై ఫోకస్ పెట్టిందన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ పై చర్చ సందర్బంగా అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. తమది బీసీల పక్షపాతి ప్రభుత్వమన్నారు. బీసీల అభివృద్ధికి కోసం గతంలో ఎన్నడూలేనంతగా ప్రస్తుత బడ్జెట్ లో అత్యధికంగా రూ.33,878.45 కోట్ల నిధులు కేటాయించినందుకు సీఎంకు, మంత్రి పయ్యావుల కేశవ్ కు ధన్యవాదాలు తెలిపారు.
చేపలు ఇవ్వడం కాదు…చేపలు ఎలా పట్టాలో నేర్పాలన్నది చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. దీనిలో భాగంగానే బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. మినీ డెయిరీలు, గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లు, జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓబీఎంఎంఎస్ ద్వారా మేదర, కుమ్మరి/ శాలివాహన కుల వృత్తులకు చెందిన వారికి ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. సముద్రంలో చేపల వేట విరామ సమయంలో రూ.20,000 లు ఆర్థిక సహాయం అందజేయ బోతున్నామన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
బీసీ బిడ్డల విద్య కోసం అధిక ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేశామన్నారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి సన్న బియ్యం వినియోగించనున్నామన్నారు. బీసీ హాస్టళ్లలో ఎస్ఆర్ శంకరన్ రిసోర్సు సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. గతేడాది 25 ఎంజేపీ స్కూళ్లో కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఎంజేపీ స్కూల్లో విద్యనందిస్తున్నామని తెలిపారు.