రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి
తాడేపల్లి : సీఎం చంద్రబాబు పాలనలో రైతన్నలకు మేలు జరుగుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖమంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ గా మర్రిరెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తాడేపల్లిలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడన్నారు. వ్యవసాయాన్ని, రైతులను గాలికొదిలేశాడన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాడన్నారు. అధిక విద్యుత్ ఛార్జీలు భారంతో వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరిగి పోయాయన్నారు.
వ్యవసాయం గిట్టుబాటు కాక పోవడంతో జగన్ పాలనలో ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే వ్యవసాయానికి మోటార్లు బిగించే కార్యక్రమాన్ని అడ్డుకున్నారన్నారు.
జగన్ రెడ్డి తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దు చేశారని మంత్రి తెలిపారు. రైతులకు మేలు కలిగేలా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్నిచేపట్టారని అన్నారు. వ్యవసాయంలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ, డ్రోన్ వినియోగంపై రైతులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు. వ్యవసాయ ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రకృతి సేద్యానికి పెద్ద పీట వేస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత.