మంత్రి సత్య కుమార్ యాదవ్
అమరావతి – గిరి పుత్రుల ఆరోగ్యంపై ఏపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ . దానికి నిదర్శనమే గిరి ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . డోలీల మోతలకు స్వస్తి పలకాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అందుబాటులోకి తెచ్చిందే ఈ కంటైనర్ ఆస్పత్రి. రాష్ట్రంలోనే తొలిసారిగా మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలసలో దీనిని ప్రారంభించామని తెలిపారు సత్య కుమార్ యాదవ్.
ఈ ఆస్పత్రి ద్వారా గిరిజనుల ఆరోగ్య సమస్యలు చాలా వరకు తీరుతాయని తెలిపారు. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు మైదాన ప్రాంతాలకు రావాల్సిన పని లేదన్నారు. గర్భిణులకు, వృద్ధులకు, అత్యవసర సమయాల్లో సత్వర వైద్యం అందుతుందని స్పష్టం చేశారు. ఈ గిరి ఆరోగ్య కేంద్రంలో రెండు రోజులు పీహెచ్ సీ డాక్టర్లు.. మూడు రోజులు ఏఎన్ఎం, ఎంఎల్ హచ్ పీలు ఓపీ సేవలు అందిస్తారని తెలిపారు.
మలేరియా, డెంగ్యూ సహా 14 రకాల వైద్య పరీక్షలు ఇక్కడ చేస్తారని వెల్లడించారు. టీకాలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అవసరం మేరకు అక్కడికక్కడే 105 రకాల మందులు అందిస్తారని , అలాగే 104 మెడికల్ యూనిట్ కూడా వారానికి ఒక రోజు ఈ ఆస్పత్రి వద్దకే వచ్చి సేవలు అందిస్తుందని పేర్కొన్నారు సత్య కుమార్ యాదవ్.
ఇలాంటి వినూత్న ఆలోచన చేసిన మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ కు, ఇతర అధికారులకు అభినందనలు తెలిపారు. త్వరలోనే మరిన్ని గిరి ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర మంతటా ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అన్నారు.