విజయానంద్ నియామకంపై మంత్రి స్పందన
అమరావతి : బీసీల పట్ల నిబద్ధతను సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి చాటుకున్నారని మంత్రి ఎస్.సవిత కొనియాడారు. నూతన సీఎస్ గా బీసీ బిడ్డ విజయానంద్ ను నియమించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ఆవిర్భావ నుంచి బీసీలకు పెద్దపీట వేస్తూ వస్తోందన్నారు. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ ను నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
దివంగత సీఎం అన్న ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడుగు , బలహీన వర్గాల వారిని రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తూ వస్తున్నారన్నారు. ఏపీ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా ఓ బీసీ అధికారి సీఎస్ నియమితులవ్వడం గర్వంగా ఉందన్నారు. బీసీ బిడ్డకు కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం లభిస్తోందన్నారు. తన కేబినెట్ లో మంత్రులుగా ఎనిమిది మందికి అవకాశం ఇచ్చారని తెలిపారు. మరో బీసీ సీనియర్ నేత చింతకాలయ అయ్యన్న పాత్రుడిని శాసన సభ స్పీకర్ గా నియమించారన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రిగా అవకాశమిచ్చారని పేర్కొన్నారు.
తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా బీసీ నేత పల్లా శ్రీనివాస్ నిమియతులయ్యారన్నారు. సీఎస్ తోపాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు, టీటీడీ చైర్మన్ శ్యామలరావు కూడా బీసీలు కావడం గర్వకారణమన్నారు. అయిదేళ్ల జగన్ పాలనలో ఏనాడూ బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.