రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పెనుకొండ : అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబు అని, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఓటేసిన ప్రజలను, కన్నతల్లిని, చెల్లెళ్లను మోసగించిన జగన్ కంటే ఈ లోకంలో ఇంకెవ్వరూ వెన్నుపోటుదారుడు ఉండరన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడమే కాకుండా ఇష్టారాజ్యంగా దోపిడికి తెగబడడంతోనే జగన్ రెడ్డిని ప్రజలు ఓడించారన్నారు.
పెనుకొండ పట్టణంలోని న్యూ కాలనీలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను, ఉచిత గ్యాస్ సిలిండ్లను మంత్రి సవిత ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడుతూ, వెన్నుపోటుకు, గొడ్డలిపోటుకు జగన్ బ్రాండ్ అంబాసిడరన్నారు. అధికారం కోసం ఇష్టారాజ్యంగా హామీలిచ్చి అమలు చేయకుండా చేతులెత్తేసిన అసమర్థుడు జగన్ రెడ్డి అని మండిపడ్డారు.
అసెంబ్లీ సాక్షిగా అమరావతే రాజధాని అని చెప్పి గెలిచిన తరవాత మూడు ముక్కలాటకు జగన్ రెడ్డి తెరతీశాడన్నారు. పోలవరం పూర్తి చేస్తానని చెప్పి పట్టించుకోవడం మానేశాడన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అన్ని విధాల వెన్నుపోటు పొడిచిన జగన్ సిగ్గుపడాలన్నారు. ఎవరికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారని మంత్రి సవిత ప్రశ్నించారు. ఓడించినందుకు ప్రజలకు వ్యతిరేకంగా జగన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారా..? అని మంత్రి నిలదీశారు.