మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం కేసీఆర్ పై. గోబెల్స్ రావుగా పేరు మార్చుకుంటే మంచిదన్నారు. ఆంధ్రప్రదేశ్కు లాభం చేకూరేలా బీఆర్ఎస్ గత పదేళ్లు పని చేసిందంటూ ఆరోపించారు. కృష్ణా జలాల్లో 512 టీఎంసీలు ఆంధ్ర తరలించుకు పోగా కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు వచ్చేలా ఒప్పందాలు చేసుకుని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు అసత్యాలను వాస్తవాలుగా చెప్పడంలో సక్సెస్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నేతలు గోబెల్స్ రావు అని పేరు మార్చుకుంటే సరిపోతుందంటూ హరీశ్ రావుపై సెటైర్లు వేశారు. గోబెల్స్ బతికి వుంటే.. నన్ను మించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వీళ్లను చూసి ఆశ్చర్య పోయేవారన్నారు.తెలంగాణ కోసం చివరి వరకు పోరాడతాం అని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా, హక్కులపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. న్యాయం జరగడం కోసం చివరి వరకూ పోరాటం చేస్తామన్నారు.
నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పులన్నీ డాక్యుమెంట్ రూపంలో కేంద్రానికి అందజేయడం జరిగిందన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తగ్గేదే లేదన్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో మిగిలిపోయేలా అతపెద్ద తప్పు చేసిందన్నారు. గోదావరి బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.
ఎట్టి పరిస్థితుల్లో బనకచర్ల ప్రాజెక్టును ఆమోదించేది లేదన్నారు.