మంత్రి వాసం శెట్టి సుభాష్ కామెంట్స్
అమరావతి – అధికారం ఉంది కదా అని విర్రవీగిన వాళ్లకు జైలు కూడు తప్పదని హెచ్చరించారు మంత్రి వాసం శెట్టి సుభాష్. టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన దళితుడుని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇబ్బంది పెట్టాడని ఆరోపించారు. అందుకే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారన్నారు. టీడీపీ కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగదన్నారు. కేసులకు సంబంధించి పారదర్శకంగా విచారణ చేపడతామన్నారు.
వాసం శెట్టి సుభాష్ గురువారం మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై స్పందించారు. తమకు ఎలాంటి కక్ష ఎవరిపై లేదన్నారు. ఆనాడు జగన్ మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వల్లభనేని వంశీ, పేర్ని నాని, కొడాలి నాని, పెద్దిరెడ్డి, రోజా ప్రవర్తించారని సంచలన కామెంట్స్ చేశారు మంత్రి.
ఇష్టం వచ్చినట్లు రౌడీల లాగా ప్రవర్తిస్తే ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ స్థాయిలో ఉన్నా సరే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు వాసంశెట్టి సుభాష్. అసలైన రెడ్ బుక్ ఇప్పుడే మొదలయిందన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలి వేసే ప్రసక్తి లేదని హెచ్చరించారు.