వరుసగా హైదరాబాద్ అందాల పోటీలపై ఫైర్
హైదరాబాద్ – ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో ప్రభుత్వం చేపట్టిన అందాల పోటీలు ముగిశాయి. కానీ వివాదాలు వెంటాడుతున్నాయి. మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ సంచలన వ్యాఖ్యలు చేశారు మరోసారి. మిస్ వరల్డ్ 2025గా థాయిలాండ్ కు చెందిన ఓపల్ సుచతా చువాంగ్శ్రీని విజేతగా ప్రకటించారు. అయితే, పోటీ చుట్టూ ఉన్న వివాదాలు కొనసాగాయి.
మిస్ వరల్డ్ పోటీని సంపన్న పెట్టుబడిదారులను అలరించడానికి వేదికగా ఉపయోగించారని ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ముగింపునకు ముందే పోటీ నుండి వైదొలిగారు . ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీశాయి.
ది గార్డియన్ నివేదిక ప్రకారం, హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ ఈవెంట్ సందర్భంగా ఒక గుర్తు తెలియని వ్యక్తి తనను సంప్రదించాడని తెలిపింది. తాను లండన్ లేదా ఇంగ్లండ్ లో ఉన్నప్పుడు కలవాలని చెప్పాడని తెలిపింది. ఈ కామెంట్ తనను మరింత ఇబ్బంది పెట్టేలా చేసిందని ఆరోపించింది మిస్ మిల్లా మాగీ.
మరో వైపు ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించింది మిస్ వరల్డ్ సీఈఓ జూలియో మోర్లీ. పోటీలో నిలవలేకనే తను ఆరోపణలు చేస్తోందంటూ ఆరోపించింది. దీనిపై తీవ్రంగా స్పందించింది మాగీ. నేను గెలవలేనని భావించి నేను నిష్క్రమించ లేదని పేర్కొంది. తాను నమ్మిన దాని కోసం నిలబడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అందాల పోటీలలో చిరునవ్వుల వెనుక చాలా కన్నీళ్లు ఉన్నాయని వాపోయింది.