ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సవాల్
అమరావతి – మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పొట్టేలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావో చెప్పాలన్నారు. ప్రజల ఇచ్చిన తీర్పుతో మతి భ్రమించి ప్యాలెస్ లో టీవీలు పగలగొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావా అంటూ మండిపడ్డారు.
ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఎలా అని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం రాక ముందు జరిగిన సంఘటనకు ప్రభుత్వానికి సంబంధం ఏంటి అంటూ నిలదీశారు. నీ పర్యటనలో ఇద్దరు మీవాళ్లే చనిపోతే పరామర్శించక పోవడం దారుణమన్నారు.
శుక్రవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఇకనైనా జగన్ రెడ్డి తన కపట నాటకాలకు కట్టి పెట్టాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు కాబట్టే నువ్వు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నావన్న నిజం గుర్తిస్తే మంచిదన్నారు. రౌడీలు, గుండాలు, గంజాయి బ్యాచ్ లను వెనకేసుకొస్తూ తలలునరికితే తప్పెందంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు ఒక నియంతలా పరిపాలించి.. నేడు మళ్ళీ అధికారం కోసం కులాలు, మతాలు, ప్రజలు, ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చ గొట్టాలని చూడడం మంచి పద్దతి కాదన్నారు.
నువ్వు గెలుస్తావని బెట్టింగ్ పెట్టి ఆ డబ్బులు కట్టలేక నాగ మల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తరువాత పరామర్శకు వెళ్ళి.. మరో ఇద్దరి చావుతో శవ రాజకీయాలు చేస్తున్న నీవు.. దమ్ముంటే చర్చకు సిద్దమా అని సవాల్ చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అరాచక ఆటవిక విధానాలకు నాంది పలికి హత్యా రాజకీయాలను ప్రోత్సహించి గోబెల్స్ ప్రచారంతో అధికారం చేపట్టి అడ్డగోలు పనులన్నీ చేశావన్నారు. నీకు ఎర్ర గడ్డ లేదంటే విశాఖ మానసిక ఆస్పత్రుల్లో చేర్చాలన్నారు. అప్పుడే నీకు తిక్క కుదురుతుందన్నారు ఎమ్మెల్యే.