పహల్గామ్ దాడి నేపథ్యంలో ట్రయల్
తిరుమల – తిరుమల పుణ్య క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్త బాంధవులు వస్తుంటారు. పెద్ద ఎత్తున వచ్చే వారి భద్రత విషయంలో టీటీడీ భద్రతా విభాగం నిత్యం పర్యవేక్షణ చేస్తుంటుంది. అలిపిరి ఘటన తర్వాత సెక్యూరిటీని మరింత పెంచింది. తాజాగా కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో భద్రతా దళాల మాక్ డ్రిల్ ద్వారా నిర్వహించారు.
అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు.అసాల్ట్ డాగ్ ఎనిమీ ఎటాక్, రూమ్ ఇన్టర్వెన్షన్ కార్యకలాపాలు చేసి చూపారు. దాదాపు ఒకటిన్నర గంటపాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. ఈ మాక్ డ్రిల్ 28 మంది ఆక్టోపస్ కమాండోలు, 25 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 10 ఏపీఎస్పీ సిబ్బంది ఈ మాక్ డ్రిల్ లో భాగమయ్యారు.
ఈ కార్యక్రమంలో వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, డీఎస్పీ విజయ శేఖర్, ఏవిఎస్ఓలు, పోలీసు, ఆక్టోపస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.