నారా చంద్రబాబు నాయుడు ప్రకటన
విశాఖపట్నం – ఆర్గానిక్ ఆహారం అనారోగ్యానికి దూరం చేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీ ఉపయోగించి, కంట్రోల్ రూమ్ల ద్వారా పర్యవేక్షించడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు సంఘీభావంగా పని చేశారని చెప్పారు. విశాఖపట్నం అంటే నాకు అమితమైన అభిమానం అన్నారు. విశాఖ కలెక్టరేట్ తో నాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. హుద్హుద్ తుఫాన్ సమయంలో ఇక్కడే ఉన్నానని గుర్తు చేశారు. తుఫాన్ ధాటికి చెట్లన్నీ పడిపోయి అప్పుడు నగరం కళావిహీనంగా మారిందన్నారు.
11 రోజుల పాటు ఇక్కడే ఉండి సాధారణ స్థితికి తీసుకొచ్చానని అన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రజలు బాధలో ఉండి ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉంటారని, చంద్రబాబు ఆదుకుంటారు అనే నమ్మకంతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారని అన్నారు. తాను రెండు సార్లు సీఎంగా పనిచేసినా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని గతంలో ప్రధాని మోదీ నాతో అన్న మాటలు జీవితంలో మర్చిపోలేనని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలు చేపట్టామన్నారు. 100 పర్యాటక ప్రాంతాల్లో యోగా చేయాలనుకుంటే 101 చోట్ల నిర్వహించామన్నారు. సూరత్లో 1.47 లక్షల మందితో యోగా చేసి గిన్నీస్ రికార్డ్ సాధిస్తే, నేడు 3 లక్షలమంది పైచిలుకు మందితో యోగా డే నిర్వహించామన్నారు. రాష్ట్రంలో 1.30 లక్షల ప్రాంతాల్లో యోగా సాధన చేశారని తెలిపారు. మొత్తంగా 2.17 కోట్ల మంది పాల్గొన్నారని చెప్పారు సీఎం. 1.44 లక్షల మంది యోగా శిక్షకులు తయారైనట్లు చెప్పారు. కేంద్రం కూడా ప్రమోట్ చేసేందుకు 5 లక్షల టీ షర్టులు, మ్యాట్లు 5 లక్షలు రాష్ట్రానికి పంపించిందన్నారు.