స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్
కడప: అవమానించిన చోటే సైకిల్ పై జైత్రయాత్ర చేసిన మీలాంటి పసుపు సైనికులే మాకు స్పూర్తి, ప్రతిపక్షంలో ఉండగా అధినేతకు అండగా మీలాంటి వారు అందించిన సంఘీభావంవల్లే గత ఎన్నికల్లో విజయఢంకా మోగించామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభినందించారు. గత ప్రభుత్వంలో బాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకు సంఘీభావంగా 2023 అక్టోబర్ 2న ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు సైకిల్ యాత్ర చేపట్టారని గుర్తు చేశారు.
నిద్రవెంగి రామకృష్ణ, చిల్లా రామసూరి, నిద్రవెంగి ఆదినారాయణ, బోయ పెంటారెడ్డి, ఎన్. సుందర్ రావు, సరగడ రమేష్ లను ప్రత్యేకంగా అభినందించారు నారా లోకేష్. సైకిల్ యాత్ర పుంగనూరు నియోజకవర్గం సుదాలమెట్టకు చేరుకున్న సమయంలో వైసిపికి చెందిన చెంగలాపు సూరి, మరికొందరు అతడి అనుచరులు టిడిపి కార్యకర్తలను చొక్కాలు విప్పించి తీవ్రంగా అవమానించి అడ్డుకున్నారని ఆరోపించారు. ఆనాటి వైసిపి నాయకుల ఆ అరాచక పర్వం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమై సోషల్ మీడియాలో వైరల్ అయిందన్నారు.
అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎక్కడైతే యాత్ర నిలిపివేశారో అక్కడి నుంచి ఆ ఆరుగురు టిడిపి కార్యకర్తలు సోమవారం సైకిల్ పై జైత్రయాత్ర ప్రారంభించి కడప మహానాడుకు చేరుకోవడం పట్ల ఆనందంగా ఉందన్నారు. అరాచక పాలనపై మీవంటి వారు ధైర్యంగా గళమెత్తడం వల్లే గత ఎన్నికల్లో వైసిపికి ప్రజలు బుద్దిచెప్పారని అన్నారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని యువనేత లోకేష్ భరోసా ఇచ్చారు.