ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల
అమరావతి – సమాజంలో పని చేస్తున్న ఎలక్ట్రిషియన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. సేఫ్టీ అన్నది గాలిలో దీపంగా మారిందన్నారు. గతంలో విద్యుత్ఘాతంతో సురేష్ మృతి చెందిన ఘటన తనను కలిచి వేసిందన్నారు. అందుకే పిఠాపురం నియోజకవర్గంలో పని చేస్తున్న 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లకు రక్షణ, భద్రత ఉండేందుకు గాను సేఫ్టీ కిట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. అంతే కాకుండా వీరి భద్రత కోసం తమ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు ఈ రక్షణ పరికరాలను తప్పనిసరిగా వాడాలని సూచించారు పవన్ కళ్యాణ్. పని ప్రదేశంలో విద్యుత్ షాక్ తో మరొకరు చని పోకూడదన్నారు . రక్షణ ఏర్పాట్లు చేసినా ప్రాణం కోల్పోయే ప్రమాదం ఉంటే కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన ద్వారా రూ.2 లక్షలు, చంద్రన్న బీమా ద్వారా మరో రూ. 2 లక్షలు అందించే ఏర్పాట్లు చేశామని చెప్పారు . గత ప్రభుత్వo వ్యవస్థలను అస్తవ్యస్తంగా మార్చేసిందని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించిందన్నారు. గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టడంతోపాటు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దరిస్తామని ప్రకటించారు కొణిదల పవన్ కళ్యాణ్.
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ మాట్లాడుతూ మూడు నెలల క్రిందట ఆటో ఢీకొని ముగ్గురు ఉపాధి శ్రామికులు మరణించారు. వారికి ప్రభుత్వ జీవో ప్రకారం చెరో రూ.50 వేలు పరిహారం అందించాం. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పదేళ్లుగా కొనసాగుతున్న జీవోను సవరించి బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు పరిహారం అందేలా చేశారని చెప్పారు. అలాగే రూ. 2 లక్షలు సరిపోవని భావించి వారం రోజులపాటు ఒక డ్రైవ్ లా కోటి మంది ఉపాధి శ్రామికులకు ఇన్సురెన్స్ చేయించారని తెలిపారు.
భవిష్యత్తులో ఉపాధి శ్రామికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.4 లక్షలు పరిహారం అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.