కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
చెన్నై – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సంపూర్ణంగా ఎన్డీయే సర్కార్ కు మద్దతు ఇస్తున్నారు. సోమవారం చెన్నై వేదికగా జరిగిన కీలక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగంచారు. జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్బంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ను ఉద్దేశించి మాట్లాడటం కలకలం రేపింది. తాను కూడా ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకోగలనని అన్నారు పవన్ కళ్యాణ్.
అయితే జమిలిపై సీఎం స్టాలిన్ తన నిర్ణయాన్ని మరోసారి పునరాలోచించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల కేంద్రంపై పెను భారం పడుతుందన్నారు. ఇది పూర్తిగా ప్రజలకు నష్టం కలిగిస్తుందన్నారు. విలువైన సమయం కూడా వృధా అవుతుందని చెప్పారు పవన్ కళ్యాణ్.
ఇదే సమయంలో తమిళనాడులో బీజేపీ కూటమి విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అవసరమైతే ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఎన్డీయే కూటమి గెలుపు కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు పవన్ కళ్యాణ్. సినిమాలు వేరు,రాజకీయాలు వేరని అన్నారు. అయితే రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టిన సహచర నటుడు దళపతి విజయ్కు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానని అన్నారు. ఈవీఎంలపై వైసీపీకి ఓ విధానం అంటూ లేదన్నారు.