ఆకలి తీరుస్తున్నాం ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం
అమరావతి – ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా రంజక పాలన అందిస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చాలా కష్టాలు, ఒత్తిళ్లు మధ్య పాలన చేపట్టామన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు నుంచి ఆంధ్రప్రదేశ్ బాగుకోసం ఆలోచించానని అన్నారు. 2019లో ప్రభుత్వం మారిన వెంటనే విధ్వంస పాలన మొదలైందన్నారను. బూతులు తిట్టడం, భయ పెట్టడం పరిపాటిగా మారిందన్నారు. ప్రశ్నించే వారిని ఏదో ఒక నెపం పెట్టి జైల్లో పెట్టాలని చూశారని ఆరోపించారు. ఏదైనా మాట్లాడదాం అంటే రౌడీమూకలు దాడులకు తెగ పడేవారన్నారు. అధికార యంత్రాంగం భయం గుప్పెట్లో చిక్కుకు పోయిందన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
వీటన్నింటి మధ్య రాష్ట్రం విలవిలలాడి పోయింది. ఇలాంటివన్ని ప్రజాహితం కోరుకునే ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేసింది. వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నంలో నన్ను బయటకు రానివ్వలేదన్నారు పవన్ కళ్యాణ్. యువగళం పాదయాత్ర సమయంలో మంత్రి లోకేష్ ని ఇబ్బంది పెట్టారని అన్నారు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వదల్లేదన్నారు. వైసీపీ పాలన చూశాక రాష్ట్రానికి అసలు వెలుగు వస్తుందా? అని అనుకున్నా. కూటమి ప్రభుత్వం రాకుంటే రాష్ట్రం ఏమయ్యేదో అనిపించిందన్నారు.
స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047, వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. యోగాంధ్రతో ప్రపంచ రికార్డు సృష్టించామన్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించకున్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వంలో రూ.3 వేలుగా ఉన్న పింఛనును రూ.4 వేలకు పెంచామన్నారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.6 వేలు చేశామన్నారు. తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితం అయిన వారికి రూ. 5 వేల నుంచి రూ.15 వేలకు పెంచి ఆర్ధిక భరోసా కల్పించామని చెప్పారు.
గత ప్రభుత్వం సామాజిక పింఛన్ల కోసం నెలకు రూ.1,939 కోట్లు వెచ్చిస్తే.. కూటమి ప్రభుత్వం రూ. 2,717 కోట్లు ఖర్చు చేస్తూ.. 63 లక్షల మందికి చేయూత ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 204 అన్న క్యాంటిన్లు ప్రారంభించి సగటున రోజుకు 3 లక్షల మంది ఆకలి తీరుస్తున్నామన్నారు. దీపం 2 పథకం ద్వారా తొలి విడత 1.15 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించామన్నారు. ఈ పథకం కోసం ఐదేళ్లలో రూ. 13,423 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయనున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్. వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే భృతిని రెండితలు చేసి ఒక్కొక్కరికి రూ. 20 వేలు చొప్పున అందిస్తున్నామని తెలిపారు.