ఘనంగా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ
తిరుపతి – తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో జూన్ 26 నుండి జూలై 5వ తేదీ వరకు శ్రీ పెరియాళ్వార్ ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ).
ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి తమ శిష్య బృందంతో కలిసి శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలోని శ్రీ పెరియాళ్వార్ వారి సన్నిధిలో ప్రబంధ పాశురాలను నివేదిస్తారు. చివరి రోజైన జూలై 5వ తేదీ ఉదయం శ్రీ పెరియాళ్వార్కు తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీ గోవిందరాజ స్వామి వారు గరుడ వాహనంపై, శ్రీ పెరియాళ్వార్ గజ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
శ్రీ మహా విష్ణువుకు పెరియాళ్వార్ పరమ భక్తుడు. శ్రీ ఆండాళ్ అమ్మ వారికి ఈయన తండ్రి. శ్రీ పెరియాళ్వార్ తులసి మాలలు కట్టి ప్రతిరోజు స్వామి వారికి సమర్పించేవారు. తండ్రితో పాటు ఆరాధించిన ఆండాళ్ అమ్మ వారు చివరకు స్వామి వారినే భర్తగా భావించారు. శ్రీ పెరియాళ్వార్ ఎన్నో పాశురాలను రచించి స్వామి వారికి అర్పించారు. ఈయనకు శ్రీమహా విష్ణువు సాక్షాత్కారం జరిగినట్టు అర్చకులు తెలిపారు.