వివరాలు వెల్లడించిన సీఎం యోగి ఆదిత్యానాథ్
న్యూఢిల్లీ – ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభ మేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ 19లోని భక్తుల శిబిరంలో రెండు సిలిండర్లు పేలాయి. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు అగ్నిమాపక సిబ్బంది. హుటా హుటిన సీఎం యోగి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై సీఎంతో ఫోన్ లో మాట్లాడారు పీఎం మోడీ. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మహా కుంభ్ లో దాదాపు 100 గుడారాలకు మంటలు అంటుకున్నాయి. భద్రతా ఏర్పాట్లలో భాగంగా వేదిక వద్ద ఇప్పటికే నిలిపి ఉంచిన ట్రక్కులు ప్రభావిత ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పాయి.
కాగా ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించ లేదని పోలీసులు స్పష్టం చేశారు. చుట్టు పక్కల గుడారాలలో నివసిస్తున్న ప్రజలను భద్రత కోసం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జనవరి 13న ప్రారంభమైన కుంభ మేళా ఫిబ్రవరి 26 దాకా కొనసాగుతుంది. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 7.72 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానం చేశారు.