12.2 శాతం వృద్ధిరేటు సాధించామన్న బాబు
అమరావతి – ప్రజా రంజక పాలనతో ఏపీ దేశానికే ఆదర్శ ప్రాయంగా మారిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం అన్ని రంగాలలో రాష్ట్రం పరుగులు తీస్తోందన్నారు. టెక్నాలజీ పరంగా ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పారు. 90 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు ఇస్తున్నామన్నారు. సౌరశక్తి ఉత్పత్తి, వినియోగంపై విస్త్రృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు సీఎం. ఆదరణ కింద ఎస్సీలు, బీసీలకు అండగా ఉన్నామని చెప్పారు. హంద్రీనీవాకు ఒకే ఏడాది రూ.3,800 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
పర్యాటకానికి పరిశ్రమ హోదా కల్పించడం జరిగిందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో నియోజకవర్గానికో కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక ఆంత్రపెన్యూర్ రావాల్సిన అవసరం ఉందన్నారు. అనేక కష్టాలున్నా 12.2 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. విజయవాడ, విశాఖ మెట్రోలకు అనుమతులు వస్తున్నాయని తెలిపారు సీఎం. మద్యం, ఇసుక విధానాలు కొత్తవి తెచ్చామన్నారు. ముందుకొచ్చిన పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు చంద్రబాబు. ఇప్పటివరకు 31 పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చామన్నారు.
రాయలసీమలో ముఠా తగాదాలు తుద ముట్టించడం జరిగిందన్నారు సీఎం. వైకాపా హయాంలో గంజాయిని పెంచి పోషించారు. మేం వచ్చాక గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించామన్నారు. గంజాయి పండించినా, అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలంటే నావద్ద కుదరవన్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు తీర్చామన్నారు.