13 వేల 969 ఓట్లు సాధించిన రెడ్డి
హైదరాబాద్ – అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తమ పార్టీ అభ్యర్థిని కాదని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీపాల్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. 13,969 ఓట్లు సాధించిన శ్రీపాల్ రెడ్డి.. 19వ రౌండ్ లో తాజా మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పై గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలింది.
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. మొదటి ప్రాధాన్యతలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి లీడ్ సాధించారు. శ్రీపాల్ రెడ్డికి 6,035 ఓట్లు, యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు, టీపీఆర్టీయూ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డికి 4,437 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి పూలరవీందరికి 3,115 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289 ఓట్లు దక్కాయి.
చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లు 23,641 కాగా చెల్లని ఓట్లు 494గా గుర్తించారు. కాగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు కోటా ఓట్లు 11,822 కాగా అభ్యర్థులెవరూ ఆ సంఖ్యను చేరుకోలేకపోయారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. చివరకు శ్రీపాల్ రెడ్డి ఆధిక్యంలోకి రావడంతో తను గెలిచినట్లు ప్రకటించారు రిటర్నింగ్ అధికారి.