5 వికెట్ల తేడాతో అద్భుత విజయం
గుజరాత్ – శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ సూపర్ షో చేసింది. క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో బలమైన ముంబై ఇండియన్స్ జట్టుపై 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. సుదీర్ఘ కాలం తర్వాత పంజాబ్ కు అదృష్టం వరించేలా చేశాడు స్కిప్పర్. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ కొనసాగింది. టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలై చివరకు అద్భుత విజయాలు సాధిస్తూ క్వాలిఫయర్ -2 దాకా చేరుకుంది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్.
మరో వైపు క్వాలిఫయర్ 1 లో ఇప్పటికే ఫైనల్ కు చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది పంజాబ్ కింగ్స్. కానీ అనూహ్యంగా దక్కిన మరో ఛాన్స్ ను చేజార్చుకోకుండా నేరుగా ఫైనల్ కు దూసుకు వెళ్లింది. ఈ విజయంలో కీలకమైన పాత్ర పోషించాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ముంబై ఇండియన్స్ ఇచ్చిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది పంజాబ్ కింగ్స్ జట్టు.
అయ్యర్ కేవలం 41 బంతులు మాత్రమే ఎదుర్కొని 7 ఫోర్లు, 8 భారీ సిక్స్ లతో విరుచుకు పడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. తనకు తోడుగా నేహాల్ వధేరా , జోస్ ఇంగ్లీష్ సత్తా చాటారు. నేహాల్ 48 రన్స్ చేస్తే , జోస్ 38 పరుగులతో రాణించారు. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 రన్స్ చేసింది. తిలక్ వర్మ 29 బంతుల్లో 44 రన్స్ చేయగా, సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు.జానీ బెయిర్ స్టో 24 బంతుల్లో 38 రన్స్ చేశాడు. నమన్ ధీర 18 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేశాడు.