కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కామెంట్స్
ఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో బీజేపీకి చెందిన కోవర్టులు ఉన్నారంటూ బాంబు పేల్చారు. రెండు రకాల నాయకులు ఉన్నారని, వారిలో ఓ వర్గం ప్రజలకు అండగా నిలుస్తూ వారి పక్షాన సమస్యలపై పోరాటు చేస్తున్నారని అన్నారు. మరో వర్గం నేతలు ప్రజలకు దూరంగా ఉంటూ బీజేపీతో దోస్తానా చేస్తూ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. తమ పార్టీలో ఉన్న ఆ నేతలు ఎవరో తమకు తెలుసన్నారు. వారిని గుర్తించి బయటకు పంపించే ప్రక్రియ త్వరలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు .
గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ శనివారం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. బిజెపి కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కఠినమైన చర్యలు, తొలగింపులు కూడా ఉంటాయని హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ తాను ఒక్కటే ఉండాలని అనుకుంటోందని అన్నారు. ఇందు కోసం ఇతర పార్టీలను నిర్వీర్యం చేయాలని భావిస్తోందన్నారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఆయన ముందు చూపుతో చేసిన కామెంట్స్ గుజరాత్ లో అయినప్పటికీ దేశంలోని ప్రతి రాష్ట్రంలో పార్టీలోనే ఉంటూ బీజేపీ కోసం పని చేస్తున్న నేతలలో గుబులు రేపింది.