ఏకగ్రీవంగా ఆమోదించిన పాలక వర్గం
ముంబై – ప్రపంచ క్రికెట్ లోనే అత్యధిక ఆదాయం కలిగిన ఏకైక క్రికెట్ సంస్థ బీసీసీఐకి స్టాండింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ పాలక వర్గం కూడా ధ్రువీకరించింది. ప్రస్తుతానికి అధ్యక్షుడిగా ఉన్న మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ పదవీ కాలం త్వరలోనే పూర్తవుతుంది. దీంతో ఎవరు చీఫ్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి తెర దించింది బీసీసీఐ.
రాజీవ్ శుక్లా అయితేనే బీసీసీఐ ప్రెసిడెంట్ కు అర్హుడని పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ మేరకు తను పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు నెలల పాటు ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. ఇక రోజర్ బిన్నీ హయాంలో భారత జట్టు రెండు వైట్ బాల్స్ టోర్నీలతో పాటు టి20 వరల్డ్ కప్ , 2024, 2025 ఐసీసీ టోర్నీలను గెలుపొందింది. ఇదే సమయంలో సీనియర్లు, జూనియర్ ఆటగాళ్ళకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంలో కృషి చేశారు.
అంతే కాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా విమెన్ ఐపీఎల్ ను ప్రవేశ పెట్టారు. ప్రధానంగా ఆల్ రౌండర్ గా పేరు పొందాడు బిన్నీ. 27 టెస్టులతో పాటు 72 వన్డే మ్యాచ్ లకు భారత దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 47 వికెట్లు తీశాడు. 830 రన్స్ చేశాడు. వన్డేలలో 77 వికెట్లు తీశాడు. 629 రన్స్ చేశాడు. 1983 వరల్డ్ కప్ లో ఏకంగా 18 వికెట్లు తీశాడు. జట్టు కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.