ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
తిరుపతి – తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక లారీ, ఒక కారు స్వాధీనం చేసుకుని, ఏడుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గా నిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ ఎస్ ఐ సి. వినోద్ కుమార్ టీమ్ శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసి కాటూరు ఫారెస్ట్ బీటు పరిధిలో పంగూరు మెయిన్ రోడ్డు దొమ్మరపాళెం వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు.
సోమవారం ఉదయం ఒక కారు, దాని వెనుక ఒక లారీ కొద్దీ దూరం లో ఆపి, అందులోని వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని చేరుకుని చుట్టు ముట్టారు. లారీని పరిశీలించగా అందులో 72 ఎర్రచందనం దుంగలు కమీపించాయి. వాటి విలువ సుమారు రూ. 2.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వాహనాల్లో ఉన్న వారిని అరెస్ట్ చేయగా వారిలో నలుగురు తిరుపతి జిల్లాకు చెందిన వారు , మరో ముగ్గురిని తమిళనాడు వాసులుగా గుర్తించారు. వారిని ఎర్రచందనం దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డీఎస్పీలు వీ. శ్రీనివాసులురెడ్డి, షరీఫ్ లు విచారించగా సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.