ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ – ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని హెచ్చరించారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బుధవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఇకనైనా జనం మేలుకోక పోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటే మన బతుకులు ఆగం కాక తప్పదన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ మహాశయుడు మనకు అందించిన రాజ్యాంగాన్ని గనుక కాపాడుకోలేక పోతే మైనార్టీలు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలు, కార్మికులు, రైతులు తమ హక్కులను చాలా వరకు కోల్పోతారని హెచ్చరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
రాజ్యాంగాన్ని మార్చకుండా మన హక్కులకు, అధికారాలకు భంగం కలగకుండా ఉండాలంటే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ధనవంతులు, కార్పొరేట్లతో కూడిన భారతీయ జనతా పార్టీకి, మతతత్వ పార్టీలకు వత్తాసు పలక కూడదని సూచించారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని విలువైన ఓటును పని చేసే వారికి వేయాలని ఆయన కోరారు.