ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సబబేన్న సీజేఐ
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల స్పందించారు. ఈ సందర్బంగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
దశాబ్దాలుగా వెనకకు నెట్టి వేయబడ్డ ఎన్నో పేద కులాలకు ఈ చరిత్రాత్మక తీర్పు వల్ల ఇప్పుడైనా కొంత న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు ఆర్ఎస్పీ. అయితే ప్రభుత్వ రంగంలో అవకాశాలు సన్నగిల్లుతున్న ఈ తరుణంలో ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లను ప్రవేశ పెడితేనే పేద వర్గాల సంపూర్ణ అభివృద్ది సాధ్యం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
.దక్షిణ భారత దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయాన్ని తెర మీదికి తీసుకొచ్చి మూడు దశాబ్దాల పోరాటాన్ని నిర్మించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎఆర్పీఎస్) చీఫ్ మందకృష్ణ మాదిగ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో సంచలన తీర్పు వెలువరించిన సీజేఐ జస్టిస్ ధనంజయ చంద్రూడ్ కు, మిగతా ధర్మాసనంలో కీలకమైన పాత్ర పోషించిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.