తెలంగాణలో ఉప ఎన్నిక జరగడం పక్కా
హైదరాబాద్ – తమ పార్టీ పేరుతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దోచుకునేందుకు, తమ ఆస్తులను కాపాడుకునేందుకు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలు వారిని క్షమించరని, సుప్రీంకోర్టు తప్పకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ప్రాంతానికి ద్రోహం చేసిన వారికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ కాంగ్రెస్ గా మారి పోయిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ దోపిడి-దుష్ట పాలన అంతం కావడానికి శుభగడియలు చాలా సమీపంలోనే ఉన్నాయని, ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటున్నారని పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ఉల్లంఘించిన 10 మంది శాసన సభ్యులను చరిత్ర క్షమించదన్నారు.
ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం రద్దు కావడం దాదాపు గా ఖాయమనిపిస్తున్నదని తెలిపారు. ద్రోహం చేసిన ఈ వెన్నుపోటు దారులను ప్రజా కోర్టులో శిక్షించే చరిత్రాత్మక అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో వదలకూడదని హితవు పలికారు.