తిరుమలలో ఉచితంగా ట్రిప్పులు
ఏపీఎస్ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. తిరుమలలో ఇక నుంచి ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించకుండా ఉండేందుకు గాను ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం బస్సులను జెండా ఊపి ప్రారంభించారు ఏఈవో వెంకయ్య చౌదరి. ప్రైవేట్ వాహనాల దారి దోపిడీని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొండపై నుంచి తిరుపతి వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదన్నారు. ఎప్పటి లాగే రూ. 90 పెట్టి వెళ్ల వచ్చన్నారు.
గత కొన్నేళ్లుగా ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాహనదారులు ఇష్టానుసారంగా దోపిడీ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు టీటీడీకి అందాయి. దీంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈవో జె. శ్యామల రావు, ఏఈవో వెంకయ్య చౌదరి చొరవతో ఉచితంగా ట్రిప్పులు నడిపేందుకు ముందుకు వచ్చింది ఏపీఎస్ఆర్టీసీ. ప్రస్తుతానికి టీటీడీ ఆధ్వర్యంలో ఉచితంగా రోజుకు 300 ట్రిప్పులు నడుస్తున్నాయి ధర్మ రథాలు. వీటికి తోడు ఆర్టీసీ బస్సులు కూడా రానున్నాయి.
అదనంగా మరో 80 ట్రిప్పులు తోడవుతాయని ఈ సందర్బంగా చెప్పారు ఏఈవో వెంకయ్య చౌదరి. ఒక్క పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తిరుపతి నుంచి కొండపైకి ఎప్పటి లాగే ఛార్జీలు ఉంటాయని తెలిపారు. ఇక నుంచి ప్రైవేట్ వాహనాలు కాకుండా తిరుమలలో ఎక్కడి నుంచైనా నేరుగా ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లవచ్చని పేర్కొన్నారు.