ప్రముఖ సంస్థలతో ఏపీటీడీసీ ఎంఓయూ
అమరావతి – గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గేమ్ ఛేంజర్ కాబట్టే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా ఇచ్చామని స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలోని మురళీ ఫార్చూన్ హోటల్ లో జరిగిన గ్లోబల్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ (జీఎప్ఎస్టీ) టూరిజం కాన్క్లేవ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని ఇజంల కంటే టూరిజమే మిన్న అని దశాబ్దాల కిందటే తాను చెప్పిన మాట నిజమవుతోందని ముఖ్యమంత్రి అన్నారు.
భవిష్యత్ అంతా పర్యాటక రంగానిదేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పర్యాటక రంగం ద్వారానే పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉందని స్పష్టం చేశారు. వెల్నెస్, హ్యాపీనెస్ ఫ్యూచర్ డెస్టినేషన్గా ఏపీని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం పెట్టుబడులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం అన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం అన్నారు.
ఐటీ, ఉత్పత్తి పరిశ్రమలు, వ్యవసాయం కంటే ఎక్కువ మందికి పర్యాటక రంగం ఉద్యోగాలు కల్పిస్తుంది. పర్యాటక రంగం 20 శాతం వృద్ధి నమోదు చేస్తుందన్నారు. ఏపీలో భక్తుల్ని, పర్యాటకుల్ని ఆకట్టుకునేలా కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆలయం ఉందన్నారు సీఎం. శ్రీశైలంతో పాటు మరో 10 ప్రముఖ దేవాలయాలు పర్యాటక సర్క్యూట్లో ఉన్నాయని తెలిపారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, అద్భుతమైన బీచ్లు, పురాతత్వ ఆనవాళ్లు కలిగిన ప్రదేశాలు, వెయ్యి కిలోమీటర్ల బీచ్ లైన్, కోనసీమ, హార్సిలీ హిల్స్ ఇలా వేర్వేరు అంశాలు ఏపీకి ఆకర్షణలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అఖండ గోదావరి ప్రాజెక్టు చేపడుతున్నాం అని ముఖ్యమంత్రి అన్నారు.