స్పష్టం చేసిన రైల్వే శాఖ జనరల్ మేనేజర్
సికింద్రాబాద్ – రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రతపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ . సోమవారం సికింద్రాబాద్లోని రైలు నిలయంలో జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల నిర్వహణ గురించి ఆరా తీశారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగ్రవాల్ తో పాటు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు పాల్గొన్నారు. వీరితో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ కు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
జోన్ వ్యాప్తంగా ఎ.బి.ఎస్.ఎస్. (అమృత్ భారత్ స్టేషన్ పథకం) క్రింద పునరాభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు అన్ని భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ జైన్. అధికారులు, సూపర్వైజర్లు పనులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, భద్రతా ప్రమాణాలను పాటించాలని ఆయన సూచించారు. ట్రాక్ నిర్వహణ పనులు చేపట్టేటప్పుడు భద్రతా మార్గదర్శకాలను పాటించాలన్నారు.
భద్రతా సూచనలు, అనుసరించాల్సిన మార్గదర్శకాలపై క్షేత్రస్థాయి సిబ్బందికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. వర్షాకాలం నేపధ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా తీసుకోవలసిన జాగ్రత్తలను పునరుద్ఘాటించారు. అనుకోని చిన్న సంఘటనలను నివారించడానికి ట్రాక్ పెట్రోలింగ్ను బలోపేతం చేయాలని సూచించారు. వాతావరణ మార్పులు, రాబోవు భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్లలో అత్యవసర లైటింగ్ , ఇతర భద్రతా పరికరాల లభ్యతను, వాటి పనితీరును ఎప్పటికప్పుడు క్షుణ్ణoగా పరిశీలించాలన్నారు.