జ్యోతి బా పూలే సతీమణి
హైదరాబాద్ – అణగారిన వర్గాలకు కూడా చదువు అవసరమని గుర్తించిన మహోన్నత వ్యక్తి జ్యోతి బా పూలే సతీమణి సావిత్రి బాయి పూలే. జనవరి 3 ఆమె జయంతి. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. భారతీయ సమాజంలో అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త, ఉపాధ్యాయని, రచయిత్రి సావిత్రిబాయి పూలె. ఆమె బహుజనుల గొంతుకగా నిలిచారు. సర్వస్వం ధారపోశారు.
కులమతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అమ్మ సావిత్రి బాయి పూలె. భారతదేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు.1 848 లోనే అస్పృశ్యత , అంటరానితనాన్ని ఎదుర్కుంటున్న సమాజానికి బ్రాహ్మణుల ఆంక్షలను ఉల్లంఘించి అట్టడుగు వర్గాల ప్రజలకు విద్యాభ్యాసం నేర్పించిన తొలి గురువు.
మహిళల అభ్యున్నతికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి . 1840లో తనకు 9 సంవత్సరాల వయసులోజ్యోతిరావు పూలేతో వివాహం జరిగింది. వీరికి సంతానం కలగక పోవడంతో అనాధ అయిన యశ్వంత్ను దత్తపుత్రుడుగా స్వీకరించారు.
పూలె దంపతులు 1848 జనవరి 1న మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. 1848 మే 12న దేశంలో తొలి బహుజనుల పాఠశాలను నెలకొల్పారు సావిత్రి బాయి పూలె. ఆధిపత్య కులాల నుంచి అనేక దాడులు, అవమానాలను ఎదుర్కొంటూ 1849లో దంపతులిద్దరూ గృహ బహిష్కరణకు గురయ్యారు.
1852లో సేవా మండల్ అనే సంఘాన్ని స్థాపించి మహారాష్ట్రలో భర్త పూలే స్థాపించిన ‘సత్యశోధక ‘సమాజ ఉద్యమంలో సావిత్రీ భాయి కీలక పాత్ర పోషించారు.1868 అంటరానితనానికి, పితృ స్వామిక వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడారు.
మహిళా చైతన్యానికి , మూఢ నమ్మకాలకు సతీ సహగమునకు వ్యతిరేకంగా పోరాడారు. వితంతు పునర్వివాహాల కొరకు ఉద్యమించారు. కుల వ్యవస్థను వ్యతిరేకించారు. 1896 –97 లో ప్లేగు వ్యాధితో కరువుతో మహారాష్ట్ర మొత్తం అతలాకుతలం అయింది. దీనికోసం సావిత్రిబాయి పూలే జోలె పట్టి విరాళాలు సేకరించింది. ఈ క్రమంలోనే తనకు ప్లేగు వ్యాధి వచ్చి 1897 మార్చి 10న మరణించారు.