రైల్వే ప్రయాణీకులకు ఖుష్ కబర్
హైదరాబాద్ – కేంద్ర రైల్వే శాఖ ప్రయాణీకులకు తీపి కబురు చెప్పింది. ఇక నుంచి హైద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లాలని అనుకునే వారికి అత్యంత వేగవంతంగా , త్వరగా చేరుకునేలా ప్లాన్ చేసింది. గతంలో నగరం నుంచి వైజాగ్ సిటీకి చేరుకోవాలంటే కనీసం 8 గంటల సమయం పడుతుండేది. కానీ ఇప్పుడు కేవలం 4 గంటల్లోపే ప్రయాణం చేసేలా చూస్తోంది రైల్వే శాఖ.
ఈ మేరకు దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశ పెట్టేందుకు భారతీయ రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యచరణను ప్రారంభించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.
శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) వరకు సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్మెంట్ను రైల్వే శాఖ ఖరారు చేసింది. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ లైన్ను ప్రతిపాదించారు. దీనిలో భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడ సూర్యాపేట మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మిస్తారు.
ఈ రైల్వే కారిడార్ విశాఖపట్నం నుంచి మొదలై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్ మీదుగా కర్నూలు చేరుకుంటుంది. ఈ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ప్రిలిమినరీ ఇంజినీరింగ్ ట్రాఫిక్ సర్వే తుది దశకు చేరుకుంది. ఈ సర్వేకు సంబంధించిన నివేదికను నవంబర్లో రైల్వే బోర్డుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
ఈ రూట్లో శంషాబాద్, రాజ మహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళికను రూపొందించారు. ఈ రైలు మార్గం విమానాశ్రయాలకు అతి సమీపం నుంచి వెళ్లనుంది. విమాన ప్రయాణీకులు సెమీ హైస్పీడ్ రైళ్లలో తాము చేరుకోవల్సిన గమ్యానికి త్వరగా చేరుకునేలా రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది.