తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు గండి
హైదరాబాద్ – మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. నిస్సిగ్గుగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు మద్దతు తెలుపడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. గోదావరి నుంచి నీళ్లను రాయలసీమకు తరలించుకు పోయేందుకు బనకచర్ల అనే ప్రాజెక్టును ముందుకు తీసుకు వస్తున్నారని ఆరోపించారు. దీని గురించి తమ నాయకుడు హరీశ్ రావు బయట పెడితేనే సర్కార్ స్పందించిందన్నారు. ఇప్పుడు అంతా తనకు ఏదో తెలిసినట్లు నాటకాలు ఆడుతున్నాడంటూ సీఎంపై మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హితవు పలికారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి భారీ ఎత్తున నిధులను ఖర్చు చేయడం జరిగిందన్నారు. అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ పథకం డీపీఆర్ ను ఆనాడు కేంద్రం వెనక్కి పంపించిందని, ఆ విషయం కూడా తెలుసుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.. మిగిలిన పనులు పూర్తి చేసి వెంటనే నీటి కేటాయింపులు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పట్టించు కోవడం లేదంటూ ధ్వజమెత్తారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
రేవంత్ మాట్లాడే భాష ఆయనకు అందంగా అనిపించవచ్చని, కానీ ముఖ్యమంత్రి హోదాకు అది తగదన్నారు. మీరు మాట్లాడే భాష మీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుందన్న విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. కృష్ణా నీళ్ల విషయంలో తెలంగాణ ఇప్పటికే నష్ట పోయిందన్నారు. తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం జరిగిందని గుర్తుంచు కోవాలన్నారు. ఏపీలో కేవలం తెలుగుగంగకు మాత్రమే నీటి కేటాయింపు ఉందన్నారు.
కానీ ఆంధ్రాలో 300 టీఎంసీల సామర్ధ్యం గల రిజర్వాయర్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో తగినంత నీరు అందుబాటులో లేదన్నారు. కృష్ణా బేసిన్ కు కాళేశ్వరం ద్వారా సాగునీటిని తరలించాలన్న ఆలోచన కేసీఆర్ చేశారని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలు, ఇక్కడి అవసరాలు తీరిన తర్వాత మీగిలిన ప్రాంతాలకు సాగునీరు ఇస్తామని ఆనాడు చెప్పింది వాస్తవమేనని పేర్కొన్నారు. కేసీఆర్ లేకుంటే, తెలంగాణ తేకుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండేవాడని అన్నారు.