19వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలు
తిరుపతి – శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం స్వామి వారిని వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది.
ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్సేవ నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ వసంతోత్సవాలు 19వ తేదీ వరకు జరుగనున్నాయి. 18న ఆదివారం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరుగనుంది. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో నిత్యకల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ ముని రాజా, టెంపుల్ ఇన్స్పెక్టర్ ముని కుమార్, ఆలయ అర్చకులు , విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.