శ్రీ గోవింద రాజ స్వామి ఆలయం
తిరుపతి – తిరుపతి శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయ పుష్కరిణిలో ఏడు రోజుల పాటు జరిగిన స్వామి వారి తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మ వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామి వారు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో మునిక్రిష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.