ఏప్రిల్ నెలలో విశేషోత్సవాలు..వాటి వివరాలు
తిరుపతి – టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నెలలో శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి ఏప్రిల్ 3న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామి వారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. 4న,8వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. 6న శ్రీ రామనవమి సందర్భంగా సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీపట్టాభిరామస్వామి వారు మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు.
ఏప్రీల్12న పౌర్ణమి, ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. ఏప్రిల్ 22వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఏప్రిల్ 23 నుండి మే 2వ తేదీ వరకు భాష్యకార్ల ఉత్సవం నిర్వహించనున్నామని తెలిపింది టీటీడీ. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు ఈవో.