వెన్న చిన్ని కృష్ణుడు అలంకరణలో దర్శనం
తిరుపతి – తిరుపతిలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రాత్రి 07.00 గంటలకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై వెన్న చిన్ని కృష్ణుడు అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. సా. 5.00 – 05.30 గం.ల మధ్య ఊంజల్ మండపంలోకి శ్రీవారు వేంచేపు చేశారు. సా. 5.30 – 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు.
జూన్ 14 శనివారం రోజు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేపట్టారు. భారీ ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు అప్పలాయగుంటకు. ఇక్కడ స్వామి వారిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని, అనారోగ్య సమస్యలు పోతాయని భక్తుల విశ్వాసం. ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం అర్చకులు, పూజారులు వేంకటేశ్వరుడికి ఉదయం 9 గంటలకు ఘనంగా రథోత్సవం నిర్వహించారు.
ఇదిలా ఉండగా ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.