తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు
తిరుమల – శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతో పాటు వందల కృతులను స్వర పరిచిన సంగీత, సాహిత్య విద్వాంసులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 133వ జయంతి కార్యక్రమం జనవరి 23వ తేదీన జరుగనుంది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఈ విషయాన్ని టీటీడీ ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు. శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అనంతపురం జిల్లా రాళ్లపల్లి గ్రామంలో 1893, జనవరి 23న జన్మించారు. మైసూరు మహారాజ కళాశాలలో 38 సంవత్సరాలు తెలుగు ఆచార్యులుగా సేవలందించారు.
రేడియోకు ‘‘ఆకాశవాణి’’ అని పేరు పెట్టింది వీరే. వీరి ప్రతిభను గుర్తించి అప్పటి టీటీడీ ఈవో చెలికాని అన్నారావు 1949లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ బాధ్యతలను అప్పగించారు. అప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని తాళ్లపాక అరలోంచి వెలుగు చూసిన సంకీర్తనలను పరిష్కరించే బాధ్యతను వారికి అప్పగించారు.
సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతో పాటు కొన్ని వందల సంకీర్తనలను ఆయన స్వరప రిచారు. శ్రీ అనంత కృష్ణశర్మను 1979, మార్చి 11న టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియమించారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.