శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో
తిరుపతి – తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రాత్రి శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది.
ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. 8 గంటలకు ఉత్సవ మూర్తులను ఊంజల్ మండపానికి వేంచేపు చేశారు. అనంతరం నరసింహ తీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండరామునికి అభిషేకం చేశారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.
రాత్రి 7 గంటల నుండి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామ లక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయ స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవోలు గోవింద రాజన్, నాగరత్న, ఏఈవో రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.