స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్..ఈవో వెల్లడి
తిరుపతి – ఒంటిమిట్ట లోని శ్రీ కోదండ రామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం సీతా రాముల కళ్యాణోత్సవానికి విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. ప్రభుత్వం తరపున స్వామి, అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కళ్యాణోత్సవానికి లక్ష మందికి పైగా భక్తులు హాజరవుతారని టీటీడీ అంచనా వేస్తోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు అన్న ప్రసాదం, నీళ్లు, మజ్జిగ, మజ్జిగ, తలంబ్రాల ప్యాకెట్లు సిద్దం చేసినట్లు తెలిపారు.
ఒంటిమిట్టలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆలయ ప్రాంగణంలోని పరిపాలన భవనం మీటింగ్ హాల్లో ఛైర్మన్, ఈవో జె.శ్యామలరావు, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేఈవో వీరబ్రహ్మం, జెసి అదితి సింగ్, ఎస్పీ ఈజీ. అశోక్ కుమార్, సివిఎస్వో హర్షవర్థన్ రాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 147 గ్యాలరీలలో 60 వేల మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేశామన్నారు.
ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారా మెడికల్, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు చైర్మన్. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు బీఆర్ నాయుడు.
కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టామన్నారు. నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశామన్నారు.
ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు, క్యూ లైన్లలో వెళ్ళెందుకు జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు బీఆర్ నాయుడు. కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 23 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశామన్నారు. టిటిడి విజిలెన్స్ విభాగం నుండి 400 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి 2500 మంది భద్రతా సిబ్బందిని, అదేవిధంగా 130 సిసి కెమెరాలు, 07 డ్రోన్ లు ఏర్పాటు చేశామన్నారు. కామన్ కమెండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టామన్నారు. ఫైర్ ఇంజన్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలను ఏర్పాటు చేశామన్నారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో, కల్యాణ వేదిక వద్ద అన్నప్రసాద వితరణ జరుగుతోందన్నారు. కల్యాణాన్ని వీక్షించేందుకు గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు సాయంత్రం నుండి లెమన్ రైస్, చక్కర పొంగలి, బిస్కెట్ ప్యాకెట్, కారాసు అందిస్తామన్నారు.
దాదాపు 3 లక్షల తాగునీరు బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు బీఆర్ నాయుడు. ఆర్టిసి ద్వారా కడప నుండి ఒంటిమిట్ట వరకు 85 బస్సులతో 425 ట్రిప్పులు, రాజంపేట నుండి ఒంటిమిట్ట వరకు 40 బస్సులతో 220 ట్రిప్పులు అనగా మొత్తం 645 ట్రిప్పుల ద్వారా భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కల్యాణ వేదిక వరకు టీటీడీ 20 ఉచిత బస్సులు ఏర్పాటు చేసిందన్నారు.