ఏపీలో కూడా చేపట్టాలన్న షర్మల
అమరావతి – తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేపై ప్రశంసలు కురిపించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ సర్వే దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇది నిదర్శమన్నారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు ఉన్నారని, దాదాపు 90 శాతం బహుజనులే ఉండడం విస్మయ పరిచిందన్నారు. చంద్రబాబు కూడా ఏపీలో కుల గణన సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.
మంగళవారం వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇదో చారిత్రాత్మక ఘట్టమని, ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి లాంటిదన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నమ్ముతున్నామని అన్నారు.
ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు వెంటనే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.
కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలన్నారు.
మనమెంతో మనకంతా అన్నట్లుగా.. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాల్సిందేనని అన్నారు. జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా బీజేపీ దత్త పుత్రుడు జగన్ రెడ్డి దానిని తొక్కి పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు.