జూన్ 13కు విచారణ వాయిదా వేసిన కోర్టు
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన కేసులో ఫిర్యాదుదారైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు వ్యతిరేకంగా నకిలీ వీడియోలను విడుదల చేశారని కేటీఆర్, జగదీశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గతేడాది మే 25న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇదిలా ఉండగా తమపై నమోదైన ఈ కేసును కొట్టేయాలని కోరుతూ కేటీఆర్, జగదీశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ మౌసమీ భట్టాచార్య.. పిటిషనర్ల తరఫున న్యాయ వాది వాదనలు వినిపిస్తూ.. వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి కేటీఆర్, జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు చేయలేదన్నారు టీవీ రమణరావు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా నమోదైన కేసును కొట్టి వేయాలని విన్నవించారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసులు, తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని, విచారణ జూన్ 13కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.