అంగరంగ వైభవంగా తెప్పోత్సవాలు
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా పద్మ సరోవరంలో శ్రీ పద్మావతీ అమ్మవారు తెప్పపై ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు స్వామి వారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు ఉత్సవ మూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.15 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గజ వాహనంపై ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.