హుండీ ఆదాయం రూ. 2.84 కోట్లు
తిరుమల – తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 74 వేల 477 మంది భక్తులు దర్శించుకున్నారు. 28 వేల 294 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.84 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం 9 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 3 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.
ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమకు తెలియ చేయాలని ఈవో జె. శ్యామల రావు భక్తులకు విన్నవించారు. సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ సేవలు ఏర్పాటు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. మే 15 నుండి సిఫార్సు లేఖల ఆధారంగా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పునః ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన MPలు, MLAలు, MLCల సిఫార్సు లేఖలను సమర్పించే భక్తులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొంది.