శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు
తిరుమల – పుణ్య క్షేత్రం తిరుమల కిట కిట లాడుతోంది భక్త బాంధవులతో. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 95 వేల 80 మంది భక్తులు దర్శించుకున్నారు. 39 వేల 668 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం దర్శనం కోసం శిలాతోరణం వరకు క్యూ లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 20 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.
ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమకు తెలియ చేయాలని ఈవో జె. శ్యామల రావు భక్తులకు విన్నవించారు. సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ సేవలు ఏర్పాటు చేశారు.
కాగా భక్తులకు తీపి కబురు చెప్పారు ఈవో జె. శ్యామల రావు. రద్దీ కారణంగా రద్దు చేసిన సిఫారసు లేఖలను తిరిగి పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు సంబంధించిన లెటర్లను స్వీకరిస్తామన్నారు.